Powered By Blogger

23 డిసెంబర్, 2013

ఓ మనసా...

 

ఓ మనసా....
ఆశలు సమాధి అయ్యాయని చింతించకు
కంటతడి ఆరలేదని కలతచెందకు
బాధకు అంతేలేదని అంతం కాకు
ప్రపంచం పగబట్టిందని అలుసు చేసుకోకు

ఓ మనసా....
గుండెలో బాధ బరువు పెరిగితే
దించేసుకో అని సులువుగా చెప్పలేను
ఒక్క చిరునవ్వుతో చెంపమీద తడి
తుడిచేసుకో అని తెలికగా చెప్పను

ఓ మనసా....
ఓదార్పు కోరే హృదయం విలువ తెలుసు
అంతర్ముఖాన నిరాశ రూపమూ తెలుసు
కాలం గాయం చేస్తే ఆ మనోవ్యధేంతో తెలుసు
కరడు గట్టిన విధి మిగిల్చే గుండెకోతా తెలుసు

ఓ మనసా....
ఎద రొదల రంపపు కోతకు మందేలేదా
చెరలో బందీ అయిన స్వేచ్ఛకు విముక్తి రాదా
ఆలోచనల యుద్ధానికి కన్నీరే శాంతి కాదా
నీకు నువ్వే ఓదార్పు, సాంత్వన కదా...

ఓ మనసా....
అయినా ఏనాడైనా అవకాశం ఇచ్చావా
కుమిలికుమిలి నీలో నువ్వే కన్నీిరయ్యావు
ఆ కన్నీటికే వ్యధను కలిపి సిరా చేశావు
నీ మనసు కాగితంపై మళ్లీ ఆ కన్నీటినే పరిచావు
   
ఓ మనసా....
నీ మనసుకే మనసు లేదు
అందుకే ఆ అంతులేని కథకు...
అంతం వెదకలేకపోతున్నాను...
కానీ.. ఓ ప్రయత్నం మాత్రం చేశాను

ఓ మనసా....
ఓ సాయంత్రాన.. రుధిరాకాశాన్ని చూస్తూ
నా మనసుని తెల్లకాగితం చేసి..
నా ఆనందాన్ని రంగుల సిరాతో కలిపి
మనసు కథ రాయడం మొదలుపెట్టాను...

ఓ మనసా....
నా కలం నుంచి సిరా రాలేదు
రంగుల బదులు కన్నీరు ఒలికింది
అంతులేని కథకు వ్యధ తోడైంది
కాలమే చెప్పలేనిది చెప్పాలనుకుంటే...


మరో కన్నీటి కాగితం తయారైంది...
రుధిరాకాశం మరింత ఎర్రబడింది...
ఓ మనసా.... నా మనసూ చీకటిలో కలిసిపోయింది

 

18 డిసెంబర్, 2013

ఎవరో... నీవెవరో...?


రంగుల అలవా, చిలిపి కలవా
కుంచెకు చిక్కిన అల్లరివా
వర్ణాలకే వర్ణన నేర్పిన కొంటెవా
పల్లెపడుచుదనాల ఎంకివా
వయసు గుండెకోతవా...ఎవరు నీవు... ?

వసంతానికి లంగాఓణి వేసినట్టు
వెన్నెలంతా ఓ చోట పోతపోసినట్టు...
చిగురు లేతదనమంతా రంగరించినట్టు...
పాదారేళ్ల ప్రాయం చినబోయేట్టు..
అందానికే అసూయ పుట్టేట్టు... ఎవరు నీవు...?

కలలో చిక్కిన చిన్నదానివా...
ఉలితో చెక్కిన శిల్పసౌందర్యానివా...
వాకిలిలో ఓరకంట దాగిన బిడియానివా...
అల్లరి కథలు చెప్పే మల్లెల పరిమళానివా...
రంగుల బందిఖానాలో చిక్కిన సోయగమా.. ఎవరు నీవు ?

ప్రణయ గీతాల పల్లవివో...
వలపు రాగాల సరిగమవో...
కవనకేళిలో పదాల పడికట్టువో...
ఎద నర్తనశాలలో నాట్య భంగిమవో..
మందహాస మంజరివో.. ఎవరివో నీవు ?

ప్రాణం లేని శూన్యం కూడా
జాబిలి కోసం ఆరాటపడింది...
తన కౌగిలిలోనే బంధించి వదలనంది...
ప్రాణమున్న మనసే ఇది...
ఈ జాబిలి కోసం... ఆరాటం వద్దన్నా వినదే...
కానీ... అందని వర్ణలిఖితఖండ కావ్యానివి... ఎవరో నీవు ?

( ప్రముఖ తమిళ చిత్రకారుడు ఇళయరాజా వేసిన ఓ పల్లెపడుచు కాన్వాస్ చిత్రమిది)
 


 

 




29 నవంబర్, 2013

అలిగితివా... సఖి.. చెలీ...




కాస్త జాగు చేశాను... అంతలోనే అలక
ముఖము తిప్పుకుంటే గుండెకోత
నల్లంచు ఎర్రచీర చిరచిర మిరపలా
చిటపటలాడుతోంది కోపంగా...
చిగురాకు రవిక తహతహలో
దాగున్న వలపు రమ్మందిలే ప్రేమగా..

ముచ్చటగా పారాణి అద్దావు
జడగంటలు విసిరి కవ్విస్తున్నావు
నడుమ నడుమొకటి.. చంపేస్తున్నావు
రవ్వల గాజుల సవ్వడి పిలుపందిస్తున్నావు
దరిచేరితే ముఖము తిప్పావు...
అలకల చిలకల మూగనోము పట్టావు

అలిగిన చెలికి బుంగమూతే అందం
నా దానవని వస్తే ఏమిటీ రాద్దాంతం
లేరా ఆవల పదహారు వేల మంది...
కాదని ఈ చెలి కోసం వస్తే... ఇదేం విరహం

నా వేణువులో నీవు కావా వాయులీనం
నా హృదిలో నీవే కదా వలపు సుగంధం
అలసిసొలసి వచ్చితినే చెలి కోసం
సేద తీర్చరాదే.. రాధామనోహరం

అలకలో దాగున్న ఆందమే అందం
ఆ ఆందాన్ని పట్టి వేస్తానే బంధం
అద్దంలో చిక్కిందే నీ అందం..
ఓ బింబమా... చెప్పవే నీవైనా
అలక మానమని నీ సఖిని..
ఆలస్యమున కరిగిన ఒక్కో క్షణముకు
ఒక్కో ప్రణయ గాన లహరి ఈ నగుమోముకు


నిరీక్షణలో చెలి పడిన బాధ
తెలిసిందిలే ఆ మనసు వ్యధ
కానీ.. బింబము మాటున గమనించితినే
క్రీగంట చాటున చిలిపి ఆటపట్టు...
సొట్టబుగ్గలో కొంటెనవ్వు..  
ఇక బింకమాపవే.. మాధవుడే వచ్చాడు
మనసు కోరాడు... మదినిండా ప్రేమతో...



27 నవంబర్, 2013

ఆ చివరి కన్నీటి చుక్క...



ఆమె కంట కన్నీరు తడి
ఆమెవరో నాకు తెలీదు
అడిగే పరిచయమూ లేదు
కానీ... ఆ కన్నీరు అడగమంటోంది
కొన్నిటికి పరిచయాలక్కర్లేదంది
ఓదార్చే హృదయానికి హద్దులు లేవంది

ఆమె, నేను.. మధ్యలో పదడుగుల దూరం
బయట భోరున వర్షం
ఎవరికెవరో ఈ జీవితంలో
ఓ చిన్న చెట్టు నీడలో మేమిద్దరం
అంత వర్షంలో తడిసినా
నీటికి, కన్నీటికి తేడా తెలుస్తోంది

అటు తిరిగి ఆమె
ఆమె వైపు తిరిగి నేను...
కష్టం తెలుసుకోవా అని వేదనగా...
జాలిగా చూస్తూ బాధతో
ఆ వర్షంలో కలిసిపోయింది కన్నీరు...
నా అసమర్ధతను తిట్టుకుంటూ

రుధిర ధారా ప్రవాహంలా
ఆ కంట కన్నీరు కట్టలు తెంచుకుంటోంది
ఏదో తీరని కష్టమే కలిగింది
నాలో నేను ఏవేవో ఊహించుకున్నాను
వాటితో ఆమె ఏదో ఒక కష్టానికి
సరిపోతుంది అని సరిపెట్టుకున్నాను

నేల జారుతున్న కన్నీటి చుక్కలు
నా వైపు కోపంగా చూస్తూ శిధిలమయ్యాయి
జాలిలేదా అని ప్రశ్నిస్తూ కసురుకున్నాయి
ఒక్క మాట  అడిగితే ఏమైందని విన్నవించాయి
గుండెలోని బాధ చెప్పుకుంటేనే కదా
ఈ కన్నీటి బరువు తగ్గేది.. అని గుర్తుచేశాయి

నా మనసు దిటవు చేసుకున్నాను
పదడుగుల దూరాన్ని సగం చేశాను
ఏమైందీ.. అని మనసడిగింది
నా గొంతు మాత్రం పెగల్లేదు
వర్షం తగ్గింది.. ఆమె వెళ్లిపోియింది

సుదూరంగా ఆమె కనుమరుగైంది
కానీ... తన బాధాతప్త హృదయ రాయబారిగా
చివరి కన్నీటి చుక్క నా వైపే దీనంగా చూస్తూ
బాధ పంచుకోలేని జీవితం..
ఒక జీవితమేనా అని ప్రశ్నిస్తూ
జడివానలో కలిసిపోయింది...

(పై చిత్రం చూసి ఆ  చివరి కన్నీటి చుక్క భావాన్ని రాయలనిపించింది)


యువతా మేలుకో, ఓటు హక్కు వినియోగించుకో...


నిన్న యువత-ఓటు హక్కుపై మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...

నిన్న మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈనాడులో...
http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=12

నిన్న ప్రతిధ్వని ప్రత్యేక చర్చ నిర్వహించాం. ఉదయం 11.30 నుంచి ఒంటి గంటవరకు ఈటీవీ-2లో
యువత  ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటేనే సమాజం మారుతుందన్న అంశంపై
చేశాం. దానికి సంబంధించిన ఈనాడు కవరేజ్ ఇది.
సతీష్ కొత్తూరి, ఈటీవీ-2 ప్రతిధ్వని లీడ్

20 నవంబర్, 2013

ఆ మనసు లోతెంత...

వెన్నెల్లో ఆడపిల్ల మనసు
సముద్రం కన్నా లోతు
జాబిల కన్నా ఎత్తు...
నా పిచ్చి గాని... వెన్నెల్లో కదా ఆమె ఉండేది....

కనులకు కనిపించే వెన్నెల
వెన్నముద్దలా అందుతుందా
వాకిలి దాటితే పలకరించే జాబిలమ్మ
కొండెక్కి రమ్మంటే వస్తుందా...
మగువ మనసూ అంతేనా...  అందనిదా...

కెరటం తీరాన్ని తాకుతుంది...
అల చిలిపిగా పాదాన్ని ముద్దాడుతుంది
అంతమాత్రాన అల నాదైపోతుందా
నాతో వస్తావా అంటే వస్తుందా
నువ్వే రా.. అంటూ తనలో కలిపేసుకుంటుంది

కానీ... ఏంటో నా పిచ్చి మనసు
ఆమె మనసు తెలుసుకోవాలంటోంది..
మగువ మనసులో ఊసులను అన్వేషిస్తోంది
ఊహల్లో అగాధం తవ్వుతోంది...
ఏమైనా దొరికిందా.. ఆ దొరికింది.. మరికొంత లోతు

ఒక్కోసారి ఆమె కళ్లు మాటాడుతుంటాయి
మరోసారి కనురెప్పలే ఏవో చెప్తుంటాయి
కాలిబొటనవేలు కూడా శృంగారనైషధం రాయగలదు
క్రీగంట చూపు లక్ష చిక్కుముడులు వేయగలదు...
అర్ధాలు వెతకాలని పరుగులు తీశా...
దొరికింది.. ఎప్పటికీ బదులు లేని ఓ చిక్కు ప్రశ్న

విశ్వాంతరాళ అంచుల అంతు తేల్చొచ్చు
ఆ నిశీధిని నిలువునా చీల్చొచ్చు..
ఆమె మనసు పిడికిలి గుట్టు విప్పగలమా
అతి కష్టం మీద విప్పి చూశాను... ఏముంది
అక్కడ మరో అగాధం...
చేతనైతే లోతు కొలవమంటూ వెక్కిరించింది...

తన ప్రేమనంతా నిజంగా పంచాలని వస్తే
తట్టుకునే శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు...
మరి రోజూ కనిపించే ప్రేమేమిటీ... నిజం కాదా
ఏమో... ప్రేమిస్తున్నట్టే ఉంటుంది.. లేనట్టూ ఉంటుంది
ఆ రహస్యం అడిగితే నవ్వేసి వెళ్లిపోతుంది

నవ్వుతూనే విషాదాన్ని భరిస్తుంది
నవ్విస్తూనే దుఃఖాన్ని దిగమింగుతుంది
ఆనందాన్ని మాత్రం మౌనంగా అనుభవిస్తుంది
బాధ లేదూ... అంటే... మరో నవ్వునవ్వి
కన్నీటి చుక్కనొకటి చెక్కిలిపై జార్చింది
పట్టుకునే లోపే... అదీ అగాధంలోకి జారిపోయింది
నా మనసు పట్టుకోలేవని మళ్లీ వెక్కిరించింది.

కలకరిగిపోతే కన్నీరవుతుందా...
మనసుకి ముళ్లగాట్లు చేస్తే కన్నీరు జారుతుందా
లేదా ఆనందం ఎక్కువై పెల్లుబుకిన ఆనవాలా...
ఆ కన్నీటి చుక్కనైనా అడుగుదామంటే.. చేజారిందే
ఆ చుక్క... ఆమెలో ఇన్నాళ్లూ నలిగిపోయిందేమో
నవ్వేేసి... ఆ వివరం అడగొద్దని స్వేచ్ఛగా ఎగిరిపోయింది

నా ఊహకు రెక్కలొస్తే ఆమె మనసు
లోతుల్లో విహారిస్తాను...
ఆలోచన పొరల్లో ఒక్క అణువునైనా పట్టుకుంటాను
నా కళ్లలో ఆమె రూపాన్ని బంధించగలిగాను
కానీ... ఆమే గెలిచింది..
తన మనసు నీడను కూడా తాకలేకపోయాను































19 నవంబర్, 2013

పచ్చిక బయళ్లలో ముత్యాల జల్లు.. కోకిల వేణుగానం

స్వాతిచినుకుకి నమ్మకం
సంద్రం మనసు గెలవగలనని
అందుకే అంత సంద్రాన్నీ ఈదింది
ముత్యపు చిప్పులో ఒదిగి ముత్యమైంది

గడ్డిపరకకు తెలుసు తన బలమెంతో
అంత పెద్ద భూమాత మనసేంటో
అందుకే భూమినే చీల్చుకుని వచ్చింది
భూమాతకు పచ్చదనాల పసిడి చీరకప్పింది

కోకిలకు తెలుసు తన పాటేంటో
నలుపైతేనేం నల్లనయ్య కాదా అనుకుంది
మావిచిగురుతో స్నేహం చేసింది
కూకూ అంటూ సరిగమలకే పాఠాలు నేర్పింది

ఒదగి ఉండలేనే అనుకోలేదు వెదురు
వాయువునే అలింగనం చేసుకుంది
పదహారు వేలమందికి సాధ్యం కానిది... 
వేణువై మాధవుడినే వశం చేసుకుంది





7 నవంబర్, 2013

ఈ ప్రశ్నలకు బదులివ్వొద్దు...

భావోద్వేగాలంటే ఏంటి..
మనోభావాలు అంటే ఏంటి..
అవెందుకు వస్తాయి...
అంసంతృప్తితోనా, విద్వేషంతోనా..

అసంతృప్తికి సంతృప్తి సమాధానం
విద్వేషానికి ప్రేమ సమాధానం
మరి తెలిసీ అవెందుకు వస్తాయి
తెలిసీ తెలియనట్టు నటనలెందుకు వస్తాయి

అసలు శత్రువులెవరు..
మనుషులా... ఆలోచనలా
మనుషులే అయితే ఎలాంటి మనుషులు
ఆలోచనలే అయితే ఎలాంటి ఆలోచనలు


మనుషులు నిలబడేది ఎక్కడ
కూలిపోతే కాలేది ఎక్కడ
మట్టి మనుషులను పెంచలేదా
మరి మనుషులు మట్టిని పంచుకుంటున్నారెందుకు

ప్రాంతాలు పంతాలు పెంచుతాయా
పంతాలు పంపకాలు కోరుతాయా
పంపకాలు మనుషులను విడదీస్తాయా
లేక మనుషులే మనుషులను విడదీస్తున్నారా

కొన్నేళ్లుగా తొలిచేస్తున్న సందేహాలివికొన్నాళ్లుగా  నలిపేస్తున్న ప్రశ్నలివి
కానీ.. సమాధానాలు ఎవరూ చెప్పొద్దు
ప్రశ్నలే బాగున్నాయి... బదుళ్లు మెదళ్లు తొలుస్తాయి

27 ఏప్రిల్, 2013

అష్టవిధనాయికా... బృందావన మరీచిక

నిన్నో మిత్రుడు అష్టవిధనాయికల గురించి అడిగాడు. బిజీబిజీగా పనిచేస్తున్న నాకు.. అష్టవిధనాయికల వైపు దృష్టి వెళ్లిపోయింది. ఆ నాయికలు వారి హావభావాలు సుడిగుండంలా నన్ను చుట్టేసి ఏదో అసువుగా ఓకవితావేశాన్ని సృష్టించేశాయి.


ప్రేయసీ.. ప్రతి రోజూ తొలిరేయనిపించే
ముగ్దమనోహర చంద్రవదన... 
ప్రవరాఖ్యునికే మన్మధ శరమా
నా తలపులలో నీ ఎడబాటు
చూడవలెనని.. తీయని బాధకు
నిను గురిచేయవలెనని కుట్రచేసినానే చెలి
వెన్నెల కురిసిన.. వలపుల వేళ
నీ చెంత చేరక నే జాగు చేసీ.. చేసిన వేళ
ఎదురు చూపుల్లో అలసి సొలసి 
నీ కనులు సోలి... తూలిన వేళ
వచ్చినానే చెలి.. చూశాను నీ భంగిమలో
విరహాగ్నిని... అందున నాపై అసలు వలపుని
విరహోతఖంటిత...!!!

నీపై వలపు జల్లులు కురిపించిన
ఈ మనసు మరో చిన్నదాని వంక
క్రీగంట చూడగనే నీ మదిలో ఎంత కలకలం
ఊరికినే నిన్నుడికించ... నీ కన్నులలో
ప్రేమాగ్రహోదకాన్ని కురిపింపవలెనని
చేసిన కుట్రకు క్షంతవ్యుడను...
ఆ చిగురుబోడితో సరసనాటకమాడితినని
అంతలోనే అలకబూని.. దరిచేరక 
విరహాగ్ని రేపకే... నా ఖండిత నాయిక...!!!

నా గోడు పట్టదని అలకబూనేవు..
నాకు వంత పాడవని నిష్టూరమాడేవు
సత్యభామలా మూతిముడుచుకునేవు
కొంగుపట్టుకు తిరగాలన్న మాట
మదిని దాటనీయలేక... విలవిలలాడేవూ
అంతరార్థమర్ధమైనా.. అర్ధమవనట్టు
నేనుండ... తెగ విసవిసలాడేవూ..
నా ప్రేమ పరవశాన్ని పెనవేసుకునేందుకే
కాదా... నేను మాత్రం... పంతం బట్టేను గానీ
నిను కాదనగలనా... హన్నన్న..
రేయిముసుగులో... పరువాల వాకిట
నీ బానిసనే కాదే... నా స్వాధీన పతిక

అనుక్షణం నీ తపనలతో రగిలిందే
నా మనసు... అక్కడ నీకూ అటులనే కదా
నాకు తెలుసు... విధివశాత్తు నీకు నాకు
నడుమ ఇన్ని రోజుల అగాధమా..
ప్రతీ క్షణమూ యుగమై.. భారమై.. నినునను
విడదీసే శత్రువై... ఓ కాలమా కరిగిపొమ్ము
ఈ విరహవేదన నే జాలలేను... నా సఖిని
ఎడబాటులో బలిచేయలేను.. కనులారా
క్షణాలతో యుద్ధం చేసి.. నిమిషాలను కడతేర్చి
గంటల పనిపట్టి.. రోజులు కరిగించి నా తలపుల్లో
ఇన్నాళ్లు నిరీక్షణ శిక్ష వేసినందుకు... ఓ ప్రోషిత పతిక
వస్తున్నా ఇదిగో... నులివెచ్చని పూలపడకింట.. మరుల గొలుపు
సౌగంధికా... నీ దాసుడను... వేయగలవు.. మధురమైన శిక్ష

అచటిచటెచటంటే అచటకే వచ్చి అచ్చట 
ముచ్చట తీర్చితిని కదే... విరహసరస
అయిన.. అచటకెందుకు రాలేదని
మూతిముడుపెందుకే అలకల చిలక
కాటుక కనులు కలువల మొలక
ఇంతంటే చాలు అంతంత అలిగి
కడివెడు కన్నీళ్లతో నా మనసున
కళ్లాపి చల్లి... విలవిలలాడకే... విప్రలబ్ధ
నీకు తెలుసో లేదో... మనసు పడ్డ
సుందరాంగి.. కొంగు వెంటే మగడుంటాడని
తెలుసుకోవే... రంగవలిక

జామురాతిరి నీవనుకునికి పరపడతిని
బాహువుల బంధించితి... చింతించితి
తప్పు తెలిసి తడబడి ఉరికి ఒక్క చెంగున
ఇంటపడక ముందే నీ కంటపడితి..
అహో నా ఖర్మకాలి... నాపై ఎంత గాఢమైన
ప్రేమ నీకు.. పరస్పర్శా ఊహే నీకు పరమ కంపరము
అసలు కథ చెప్పిన వినకే.. మొదటే అనుమానము
తగదే... అనుమాన వనిత... కలహాంతరిత.
నిజము తెలిసి... అనుమానించితినే అని.. 
బాధపడి.. బెంగ పడి.. వలవల ఏడపెందుకే లలన..
నా అలక తొలగించ నీ కన్నీటికి సాధ్యమాయేనా..
అధరామృతాలను గ్రోవితే గానీ... నా బాధ తీరునా...

ఆహా.. ఏమిది.. పున్నమి జాబిలి నేలకు వచ్చినదా
వెన్నెల ఆకారం దాల్చి నా ముందు నిలిచెనా..
మరులు కూర్చిన మన్మధ శరమా..
నడివచ్చిన శృంగార నైషధమా..
బృందావన మరీచికా.. అభిసారిక..
నీవు వచ్చెవరకు నేను రానని 
పోటీ పెట్టకే సగభాగమా..
కాస్త.. అలకల ఆటలు సాగినా...
ఓటమి ఖాయం.. అందాన్ని బంధింప
నేనే నీ చెంతకు పరుగున వచ్చెద... 

అష్ట విధ నాయికలు, జనార్ధనాష్టకం.. ఈ రెండు పెదబాలశిక్షల్లో ఎప్పుడో చిన్నప్పుడు చదివినపుడు
తెలియలేదు. కానీ.. ఇప్పుడు తెలుస్తోంది. ఆ నాయికలను తలచుకుంటేనే కవితలు ఉప్పొంగుతున్నాయి. మన సాహిత్యం శక్తి అలాంటింది. 

విరహోతఖంటిత
భర్త  చెప్పిన వేలకు రాలేదని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ .

ఖండిత  నాయిక
తన  భర్త రాత్రంతా పర స్త్రీతో సంభోగించి రతి చిహ్నాలతో కనబడిన మగడిని చూసి దుఖించే స్త్రీ.

స్వాధీన  పతిక
తాను  చెప్పినట్లు విని , నడుచు కునే భర్త గల స్త్రీ.

ప్రోషిత  పతిక
దూరం లో ఉన్న భర్తను తలుచుకుంటూ విరహం తో రగిలి పోయే స్త్రీ. వాస్క  సజ్జిత దూరాన ఉన్న భర్త చాలా కాలం తర్వాత వస్తున్నపుడు పడక గదిని అలంకరించి భర్త రాక కోసంవిరహంతో ఎదురు చూసే స్త్రీ.

విప్రలబ్ధ
రమ్మన్న చోటికి ప్రియుడు రాకపోతే విరహం తో బాధ పడే స్త్రీ .

కలహాంతరితభర్త ఎంత చెప్పినా వినకుండా అనుమానించి చివరకు తప్పని తెలుసుకొని భాద పడే స్త్రీ.

అభిసారిక
అందంగా  అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు వెళ్ళేది, లేదా తన వద్దకే ప్రియుడిని రప్పించుకోనే స్త్రీ.



23 ఏప్రిల్, 2013

యుగాంత సంకేతాలొస్తున్నాయి....

నా టైటిల్ చూసి... నేను మూర్ఖుడునని భావించొద్దు. ఎందుకంటే కుహనా మేధావులు, నాస్తికవాదులు
భూమికి కోట్ల సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. ఏం కాదు అని చెప్తున్నారు. ఆ విషయం చిన్నపిల్లలకు
కూడా తెలుసు. భూమికి కోట్ల సంవత్సరాల ఆయుష్షు ఉంది. నిజమే కానీ మనిషికి.
ఒక్కసారి మహాభారత యుద్ధానంతర పరిస్థితుల్లోకి వెళ్తాను. పైన చెప్పిన దానికి దీనికి లింకేంటి అంటారా.
ఉంది. ద్వాపర యుగం ముగియడానికి సరిగ్గా సంవత్సరం ఉందనగా... ప్రజల జీవన సరళిలో పెనుమార్పులు.
అప్పటి వరకు రుషులు మునులను ప్రజలు దాదాపు దేవుళ్లగానే చూశారు.. అలాంటి మునొకరొస్తే..
సాంబడు ఆడ వేషం వేసుకుని ఆటపట్టిస్తే... ముసలం పుడుతుందని శపించి వెళ్లిపోతాడా ముని.
ఆ తర్వాత సాంబడు ముసలాన్ని కని చస్తాడు. అప్పుడే ద్వాపర యుగాంత సంకేతాని బలరాముడు
గ్రహిస్తాడు. అంతవరకు నందనవనంలా ఉన్న బృందావనిలో అరాచకరాజ్యాన్ని చూడలేక ఆత్మార్పణ
చేసుకుంటాడు. ఒకనాడు భారత యుద్ధ విజయోత్సాహంలో యాదవులు పండుగ చేసుకుంటారు.
అందులో కౌరవ పక్షం వహించిన కృతవర్మ లాంటి యాదవరాజులను ఆహ్వానిస్తారు. తప్పతాగి
చిందులేస్తున్న సమయంలో... వీరత్వాల మీద మాటమాట పెరిగి యాదవుల మధ్య తగాదా పుడుతుంది.
అది ఒకరి తలలు ఒకరు నరుక్కుని.. ఏకంగా యాదవ రాజ్యమే నశించిపోయే దాక వెళ్తుంది. శ్రీకృష్ణుడు అంటే
రాసలీలలు, వేణుగీతాలు ఇవే కనిపిస్తాయి. కానీ తన జాతంతా ఒకరినొకరు నరుక్కుంటుంటే చూడ్డం తప్ప
అంతటి భగవంతుడే ఏమీ చేయలేకపోయాడు. దైవత్వం లేని ఓ నరుడిలా నిశ్చేష్టగా నిలబడి.. యాదవ
రాజ్యం పతనాన్ని రెండు కళ్లతో చూశాడు. కొంతమందినైనా కాపాడమని అర్జునుడిని బతిమాలుకున్నాడు. ఆ తర్వాత అడవులు పట్టిపోయి... నిర్యాణం కోసం ఎదురుచూశాడు. అంటే దాదాపు ఆత్మహత్య.
ఆ కొంతమందినైనా అర్జునుడు కాపాడగలిగాడా అంటే లేదు. 18 అక్షౌహినుల సైన్యాన్ని చెడుగుడు ఆడిన
అర్జునుడి ధైర్యం.. శ్రీకృష్ణుడిని దైవత్వం త్యజించగానే పోయింది. గాండీవం చచ్చబడింది. దుండగులు
యాదవ వనితలను దోచుకుంటుంటే.. ఆపలేక చేతులెత్తేశాడు. ఇది జరిగిన మర్నాడే ద్వారక సముద్రంలో మునిగింది. బోయవాడి విల్లుకి, బొటనవేలిలో ప్రాణాలు పెట్టుకున్న శాపగ్రస్తుడు శ్రీకృష్ణుడుకి దిక్కులేని మరణం 
సంభవించింది. శ్రీకృష్ణుడి అవతారంలో కలి ప్రవేశించిన అంతిమ క్షణాలు ఒళ్లుగగొర్పుడిచే విధంగా, ఆఖరికి తనవాళ్లకు కనీసం తన పార్ఠీవ దేహం కూడా దక్కని విధంగా అత్యంత దుఃఖభరితంగా ఉంటుంది. ఇదంగా జగన్నాటకమే కావొచ్చు. కానీ నిజం. అలా  ఓ అవతారాన్ని మింగి వచ్చింది కలియుగం. ఇప్పుడు అసలు కథలోకి వస్తాను. యుగాంతం అంటే 2012 సినిమాలో చూపించిన విదంగా భూమి పేలిపోడం కాదు. మనిషి మనిషిని
కబళించిన రోజే యుగాంత సంకేతం. ఒక యాభై ఏళ్ల క్రితం, ఇప్పుడు పోల్చి చూడండి. నేరాల తీవ్రత, స్వభావం ఎలా మారిందో. ఐదేళ్లు నిండని ఓ పసిపాపలో ఏ కామాన్ని వెతుక్కున్నారో... ఆ నీఛులు. ఇంత కన్నా ఏం కావాలి యుగాంత సంకేతాలు. ఆడది కనిపిస్తే కబళిస్తున్నారు. వయసుతో సంబంధం లేని కామోన్మాదం.
మనిషిలో మనిషి చచ్చిన నాడు.. యుగం అంతమైనట్టే. ఇప్పుడా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందు గడిచిన యుగాల్లోనూ రాక్షసులున్నారు. కానీ వారు కూడా కొంత నీతి పాటించారు.
 ఇప్పటి మనిషి రాక్షసుడి కంటే క్రూరుడు. అది ఉన్మాద స్థాయికి చేరింది. లింగ వివక్ష వల్ల అబార్షన్లు అవుతున్నాయి. లక్షల ఆడపిల్లలు భూమ్మీద పడకుండానే గర్భస్త దశలోనే చస్తున్నారు. మొగుళ్లు, అత్తమామలు
చంపుతున్నారు. ఇది ఒక కోణం... ఇప్పుడు మరో కోణం కనిపిస్తోంది. జర్నలిస్టుగా కొందమంది మహిళలతో ముఖతా నేను మాట్లాడాను. అందులో కొందరు గర్భిణిలు ఉన్నారు. వారంతా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న వారే. కానీ.. వాళ్లలో తెలియని భయం. ఇప్పుడే ఇలా ఉంటే.. ఓ పదేళ్ల తర్వాత.. సమాజం ఇంకెంత క్రూరంగా ఉంటుందో. ఆడపిల్లలను సురక్షితంగా పెంచే, వారికి ఏ గాయమూ తగలకుండా రక్షించగలమా అనే ఆలోచన. మన దేశం మహిళలకు రక్షణ సున్న అని ఎల్కేజీ పిల్లాడికి కూడా తెలుసు. మరి ఇలాంటి క్రూరమైన మనస్తత్వాలు
పెరుగుతున్నప్పుడు... మనిషి బతకడం కష్టమే. తండ్రి కొడుకులు వావి వరసలు మరిచి మద్యం మత్తులో రక్త
సంబంధాన్ని చెరుస్తున్న రోజులివి. ఢిల్లీ ఘటన తర్వాత.. అత్యాచారాల సంఖ్య మరీ పెరగడం దేనికి సంకేతం.
ఇన్నాళ్లు బయటపడలేదు. మీడియా ఫోకస్ పెరిగాక లెక్కలు తెలుస్తున్నాయన్న మాట సరికాదు. నిజంగానే పెరిగాయి. అసలు ఆడపిల్లే లేకపోతే.. వారిని నిర్ధాక్షిణ్యంగా కడతేరుస్తుంటే.. సృష్టే లేదు. ఇక యుగమో లెక్క.
ఆనాడు ద్వాపర యుగాంత సమయంలో మరీ ఇంత దారుణాలు లేవు.. వాటినే భగవంతుడు ఆపలేక
అడవులు పట్టాడు. ఇప్పుడున్న దారుణమైన పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు కాదు కదా.. ముక్కోటి దేవతలు
ఏకమైనా.. ఈ మనిషిని మార్చలేరు.





17 ఏప్రిల్, 2013

రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం

అక్షరాలను ఇలా కూడా కూర్చొచ్చుకే.. రావూరి కవితలు కొన్ని.. కవితలను ఇలా కూడా రాయొచ్చు.
నిశీధిలో కూడా వెలుతురు తురుముని కవి గాంచగలడని నిరూపించి
ఎందరికో ఆదర్శప్రాయుడైన గురుసమానులు రావూరి భరద్వాజ.
ఆయన గురించి నేనేవో కవితలు రాసి వర్ణించే కన్నా.. ఆయన రాసిన
అద్భుతాలనే నెమరు వేసుకుంటే మంచిది కదా.. అందుకే ఆయన అక్షరాలతోనే అభినందనలు చెప్పే సాహసం చేస్తున్నాను

ఏదీ నాది కాదు - రావూరి భరద్వాజ

"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
"అసంతృప్తి" అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
"ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముదుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.
******************************

"నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది" అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

******************************

"వూవు నయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను.
నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందకి తోసేసింది" అన్నదా వాన చినుకు.
దెబ్బ తగిలిందా చిన్నా!" అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో మట్టిబెడ్డ.

******************************

"తెల్లగా, చల్లగా, మెల్లగా పోతూపోతూన్నవారు కాస్తా;హఠాత్తుగా
ఆగిపోయారెందుకు? కళ్ళు చికిలించి కిందికి చూస్తున్నారెందుకు?" అన్నదో గోరింక.
"పల్లెకు దూరంగా ఉన్న, ఆ పూరింటి ముందు, ఓ అమ్మాయిగారు, అద్దం
పుచ్చుకొని నుంచున్నారు. అందులో ప్రతిఫలిస్తున్నది నా ముఖమో, అమ్మాయిగారి
ముఖమో తేల్చుకోలేక ఆగిపోయాను" అన్నాడా పున్నమి చంద్రుడు!

*****************************






9 ఫిబ్రవరి, 2013

కాసేపు.. ఉన్నదున్నట్టు మాటాడుకుందాం....

ఇన్నాళ్ళూ ఏం రాయాలో అర్థం కాలేదు. ఏదో ఒకటి రాయడం.. చిట్ చాట్ చేయడం అస్సలు రాదు.
ఏదైనా వివరం.. ఆ వివరం సవివరంగా ఉండాలి. అందుకే రాయలేకపోయాను అని నిజాయతీగా
ఒప్పుకోడం మంచిది. ఈ మధ్యకాలంలో నేను పనిఒత్తిడిలో మునిగిపోయాను. తీరిక లేదని
ఎవరైనా అంటే నాకే నచ్చదు. కనుక.. తీరిక చేసుకోడం నాకే చేతకాలేదు. కానీ... ఇన్నాళ్లకు
మళ్లీ చేయికదిలింది. ఇప్పుడు కూడా ఏం రాయాలో ప్రత్యేకంగా ఎజెండా లేదు. ఏదో ఒకటి రాద్దామని
అనుకుంటున్నా.. ఆ ఏదో ఒకటి ఎలా ఉంటుందో ఏమో..
విశ్వరూపం సినిమా చూశా. ఉగ్రవాద భీభత్సాన్నే చూశాం... ఉగ్రవాదుల ఇళ్ళు ఎలా ఉంటాయో
బహుశా ఎవరికీ తెలీదు.. వారి సంసారాల్లో ఏముంటుందో ఒక్క శాతం మందికి కూడా తెలీదు.
కానీ... ఆ ఇళ్ళల్లో ఆడవాళ్లను.. అక్కడి పిల్లల దురవస్థను.. వారిలో చదువుకోవాలన్న
తపనని చూపించి... అక్కడ ప్రతీ వీధిలోనూ మలాలాలు అడుగడుగునా ఉన్నారన్న
వాస్తవాన్ని చూపించే ధైర్యం ఎంత మందికుంటుంది... బహుశా భారత దేశంలో కమల్ కి తప్ప
మరొకరికి అది అసాధ్యం. ఇందులో ముస్లి సోదరులకు జరిగిన ఘోర అవమానమేంటో నాకైతే
అర్థం కాలేదు. ఇది ముస్లింలకు సంబంధించి సినిమా కాదు. ఉగ్రవాద వ్యతిరేక సినిమా.
ఈ చిత్రాన్ని ఆపడం ద్వారా.. ఆ ఆపిన వారు ఉగ్రవాదాన్ని సమర్ధించాలనుకుంటున్నారా.
నాకైతే అలానే అనిపిస్తోంది. కళకు ఇలాంటివి కళంకాలు. కాబట్టి పట్టించుకోకుండా ఉంటేనే మంచిది.
నాకైతే ఒక అద్భుతమైన చిత్రం చాన్నాళ్ల తర్వాత చూశాననిపించింది. ఆఫ్గనిస్థాన్, రష్యా-అమెరికా
ఆధిపత్య పోరు, అమెరికా ఉగ్రవాదాన్ని పాలుపోసి పెంచిన కథలు తెలుసుకాబట్టి... నాకా
చిత్రం బాగా నచ్చింది. మనది లౌకిక రాజ్యం. కానీ.. లౌకికం మరీ ఎక్కువైపోయింది. అతి సర్వత్రా
వర్జయేత్. ఏ మతానికైనా. మందు మనిషి.. తర్వాతే మతమైనా, కులమైనా అనే ధృక్కోణం చదువుకున్న
వాళ్లలోనే కనిపించడం లేదు. ఓటురాజకీయాలకు కులమతాలు పాశుపత బ్రహ్మాస్త్రాలుగా మారిపోయాయి.
దేశం అంటే కులమతాలేనా. ఇంకేమీ లేవా. ఆకలి కులమేది... మట్టి మతమేది.
ఒక చిన్న కథ. వేదాల్లో బృహదారణ్యకంలో ఉంది. ఒక కుర్రాడు. అతను ఎక్కడెక్కడో పనిచేసే
ఒక పరిచారికకు దొరికితే పెంచుకుంటుంది. అతనికి యుక్తవయసొస్తుంది. తల్లి దగ్గరికి వెళ్లి నేను విద్యాభ్యాసం చేయాలి పండితుల వద్దకు వెళ్లాలి.. కనుక కులం, గోత్రం చెప్పమంటాడు. ఆ తల్లి నాయనా.. నేను ఎక్కడెక్కడో
పనిచేసే పరిచారికను. చిన్నప్పుడు నువు నాకు లభించావు. నీ కులం, గోత్రం నాకు తెలియవు. నా పేరులో సగం జాబాలి. అదే నీపేరు అంటుంది. సరే అని వేదవేదాలు చదివిన ఓ పండితుని దగ్గరకు వెళ్లి... అయ్యా నాకు విద్య
నేర్పు అంటాడు. నీ కులం, గోత్రం చెప్పు అంటాడాయన. అప్పుడు తల్లి చెప్పిన వృత్తాంతం అంతా ముక్క
పొల్లుపోకుండా చెప్తాడు. అతని సత్య నిష్టకు మెచ్చి.. ఉన్నదున్నట్టు సత్యనిష్టతో చెప్పాడు కాబట్టి... ఇతను
కచ్చితంగా బ్రాహ్మణుడే. అని విద్యాబోధకు అంగీకరిస్తాడు. ఇక్కడ రెండు విషయాలు చర్చించాలి. జాబాలి గుణంతో బ్రాహ్మణుడయ్యాడు.. సత్య నిష్ట కలిగిన వారెవరైన బ్రాహ్మణులే.. అసత్య నిష్ట కలిగినవారెవరైన నీఛులే. కులాలు మతాలు ఎప్పుడూ లేవు. గుణాలను బట్టి కులాలు పుట్టాయి, మనిషి అబిమతాలను బట్టి మతం పుట్టింది.
ఇవి పుట్టుకతో రావు... పుట్టిన తర్వాత మన నడివడికననుసరించి వచ్చేవి. మనతో పాటే వస్తాయి.. కానీ
మనవి కావు. సంస్కారం, సంస్కృతి ఇవే మనవి.. కడవరకు వచ్చేవి. ఇది వేద సారం. కాదనడానికి మనమెవరం.